పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 02, 2024, ఆదిలాబాదు:-
*ఆదివాసుల ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం.*
*రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి*
ఆదివాసులు, గిరిజనుల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆధునిక ప్రపంచానికి చేరువగా అభివృద్ధి బాటలు వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 38 కోట్ల 20 లక్షల రూపాయలతో చేపడుతున్న రోడ్లు, భవనాలు, అమరవీరుల స్మృతివనం అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక- ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళ- శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి అనసూయ్య (సీతక్క), రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసన మండలి సభ్యులు బల్మూరి వెంకటేష్, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు లతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆదివాసుల ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఐ.టి.డి.ఎ. ద్వారా గిరిజన ఆవాసాలకు 27 కోట్ల నిధులతో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. విద్యాభివృద్ధిలో భాగంగా 5 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుగ్గారం గ్రామంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని, ఇంద్రవెల్లి మండల కేంద్రంలో స్మృతివనం (అమరవీరుల స్థూపం) వద్ద 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో గ్రామీణ త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు క్రింద కెరమెరి మండలంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో ధనోరా నీటి శుద్ధి కేంద్రం పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. అమరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఇంటి స్థలం, ఇండ్ల పంపిణీలో భాగంగా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామంలో 15 మంది అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమం, అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎంతో చారిత్రాత్మక ఘనత కలిగిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, 5 లక్షల రూపాయల ఇంటి స్థలం, ఇండ్లను అమరుల కుటుంబాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత మొట్టమొదటి సారి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం జరుగుతుందని, ఆనాటి పోరాటయోధుల ఆలోచనలను ఈ ప్రభుత్వం తూ.చ. తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్, ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలాం, ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.