పత్రికా ప్రకటన
ఫిబ్రవరి 02, 2024 – ఆదిలాబాద్:
*మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యం.*
*స్కూల్ యూనిఫామ్ కుట్టే అవకాశం SHG లకే ఇస్తాం*
*రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి*
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా దర్బార్ హాల్ లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో వైఎస్సార్ సిఎం గా ఉన్నప్పుడు మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎం గా ఉన్నప్పుడు జీరో వడ్డీకే రుణాలు ఇచ్చారనీ అన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.60 కోట్లకుపైగా రుణాలను సిఎం బ్యాంక్ లింకేజి కింద పంపిణీ చేశారు. ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ 25 లక్షలు, కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.7 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి నాగోబా ఆలయంలో నాగోబా కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేదరిక నిర్ములన సంస్థ, వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్ ను సందరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్, ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలాం, ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.