ప్రతి విద్యార్థి పర్యావరణహితంగా జీవించేలా కృషి చేద్దాం
– 5 వ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
– లక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్, యుసిడి- జీవీఎంసీ
ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేద్దాం అని జీవీఎంసీ- యుసిడి, ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మి అన్నారు. శనివారం ఉదయం మురళి నగర్ లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో మురళి నగర్ గార్డినర్స్ నిర్వహించిన ఆర్ట్ అండ్ మినియేచర్ ఎగ్జిబిషన్, ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం అనే అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్, విశ్రాంత మేనేజర్ ఉదయ భాస్కర్ ఆర్ట్స్, జి రమాదేవి ప్రొఫెషనల్ మినియేచర్ ఆర్టిస్ట్ తయారు చేసిన మినియేచర్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షితులను చేస్తున్నాయి అన్నారు. సరితా అనే ఆమె ఇంటి దగ్గర పెంచుతున్న కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు. 5 వ తేదీ సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు ప్రతి ఇంటా పచ్చని మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
భారత్ కిసాన్ సంఘ్ జాతీయ నాయకులు జలగం కుమారస్వామి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఇంటి పంట కార్యక్రమం, మినియేచర్స్ తయారీ, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. రేపటి తరాన్ని మానవ విలువలతో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా ఆదర్శవంతంగా ఉందన్నారు.
చిన్నపిల్లల వైద్యులు రామకృష్ణ మాట్లాడుతూ బాలలలో చిన్నతనం నుండి పర్యావరణ పరిరక్షణ, వ్యర్ధాల నుండి మినియేచర్లు తయారు చేయటంపై అవగాహన కల్పించడం అభినందనీయం అన్నారు. ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విశాఖ నగరంలో అనేక విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఉపకరిస్తుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు అధికంగా నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు గుడ్డ సంచి వాడేలా చూడాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందజేయాలని, ఒక మొక్క అయినా నాటి పెంచాలని కోరారు.
కార్యక్రమాన్ని నిర్వహించిన ఫంక్షన్ హాల్ మేడ మీద పెంచుతున్న కూరగాయల తోట గురించి సరిత మాట్లాడుతూ నగరంలో ప్రతి విద్యా సంస్థకు వెళ్లి విద్యార్థులకు తమ ఇంటి వద్ద మొక్కలు పెంచుకోవడం, పర్యావరణ వరణ హితంగా జీవించడం, క్రాఫ్ట్ వర్క్ లు నేర్పించడం తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జీవీఎంసీ ఎస్ ఆర్ యు ప్రతినిధి అక్షత, కార్యక్రమం నిర్వాహకులు అరుణ, విశ్రాంత రైల్వే అధికారి కె ఎస్ ఎన్ రాజు, కైట్స్ స్కిల్స్ ప్రైవేటు సంస్థ ఎం డి జ్యోతి నాదెళ్ల, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం, వివిధ సంస్ధలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.